హైదరాబాద్, డిసెంబర్ 27: బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కధానాయకుడిగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు థియట్రికల్ ట్రైలర్, ఆడియో రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గుర్రం మీద ఉన్న రామ్ చరణ్ స్టిల్ మగధీరను గుర్తు చేస్తోంది. హీరోలు సైతం ఈ పోస్టర్ను రీ ట్వీట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. రంగస్థలం లాంటి చిత్రం తరువాత రామ్ చరణ్ చేస్తున్న మాస్యాక్షన్ సినిమా కావటంతో వినయ విధేయ రామపై భారీ అంచనాలే ఉన్నాయి. చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ వొబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా సీనియర్ హీరోలు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.