మోదీ గారు బుల్లెట్ రైలు తర్వాత.. ఉన్న రైళ్ళపై దృష్టి పెట్టండి: బీజేపీ నేత

SMTV Desk 2018-12-27 11:22:32  Narendra Modi, Piyush Goyal, Lakshmikantha Chavla, BJP Leaders

పంజాబ్, డిసెంబర్ 27: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లకు బుల్లెట్ రైలు విషయాన్ని పక్కనపెట్టి ఉన్న రైళ్ల సంగతి చూడాలని బీజేపీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ మంత్రి లక్ష్మీకాంత చావ్లా సూచించారు. సరయు-యమున ఎక్స్‌ప్రెస్ రైలులో అమృత్‌సర్ నుంచి అయోధ్య ప్రయాణించిన ఆమె రైలు సమస్యల గురించి మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. రైలులో ‘‘అచ్చే దిన్ ఎక్కడున్నాయని ఆమె ప్రశ్నించారు. ఆమె ప్రయాణిస్తున్న సరయు-యమున ఎక్స్‌ప్రెస్ రైలు డోర్లు బాగాలేవని, బాత్రూములో టాప్ లు పనిచేయడం లేదని, టాయిలెట్ సీట్లు పగిలిపోయాయని పేర్కొన్నారు. తాను ఎక్కిన రైలు పది గంటలు ఆలస్యంగా నడిచినట్టు వీడియోలో పేర్కొన్నారు.

ఏసీ 3 టయర్ కోచ్‌లో ప్రయాణించిన చావ్లా.. రైలులో నీళ్లు లేవని, రైలు అన్ని గంటలు ఆలస్యమైనా ఆహార సరఫరా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు అన్ని గంటలు ఎందుకు ఆలస్యమైందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే వొక్కరు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైలును దారి మళ్లించినట్టు ఆ తర్వాత తనకు తెలిసిందన్నారు. రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే స్పందన లేదని, రైల్వే మంత్రికి ఈమెయిల్స్ పంపినా స్పందన లేకుండా పోయిందని అన్నారు. రైల్వే వ్యవస్థ మొత్తం తప్పుడు సమాచారంతో నడుస్తోందని దుమ్మెత్తి పోశారు.