ఐదేండ్ల తర్వాత ఇంటికి చేరిన బాలిక... నిజంగా అద్భుతమే..!

SMTV Desk 2018-12-26 18:34:50  Kedarnath floods, Missing Girl, Five years

కేదార్ నాథ్, డిసెంబర్ 26: తప్పిపోయిన ఓ 12 ఏళ్ల బాలిక ఐదేళ్ల తరువాత తిరిగి తన కుటుంబాన్ని చేరుకుంది అంటే నిజంగా అద్భుతమే. 2013 కేదార్ నాథ్ వరదల్లో తప్పిపోయిన 12 ఏళ్ల చంచల, ఐదేళ్ల తరువాత తిరిగి తన కుటుంబాన్ని చేరుకుంది. ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే, చంచల అనే మతిస్థిమితం లేని బాలిక, తన తల్లిదండ్రులతో కలసి కేదార్ నాథ్ యాత్రకు వెళ్లింది. అదే సమయంలో వరదలు రాగా అందరు చెల్లాచెదరయ్యారు. ఈ ప్రమాదంలో చంచల తండ్రి మరణించగా, సహాయక చర్యల తరువాత తల్లి ఇంటికి చేరుకుంది.

తప్పిపోయిన చంచలను కొందరు చేరదీసి, కాశ్మీర్ లోని ఓ అనాధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమె వచ్చీరాని మాటలతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండటంతో, ఆమె వివరాలు కనుక్కునేందుకు చాలా కాలమే పట్టింది. ఆమె తన వూరు అలీగడ్ గురించి, అక్కడున్న తనవారి గురించి కొద్దీ సమాచారం ఇవ్వడంతో, విషయాన్ని చైల్డ్ లైన్ సంస్థకు చేరవేశారు. ఓ ఎన్జీవో సంస్థకు చెందిన జ్ఞానేంద్ర మిశ్రా ఎంతో శ్రమించి, పోలీసుల సాయంతో చంచల కుటుంబాన్ని కనిపెట్టారు. తమ మనవరాలు తిరిగి ఇల్లు చేరుకోవడం ఓ అద్భుతమని చంచల తాతయ్య హరీష్ చంద్, నానమ్మ శకుంతలాదేవి వ్యాఖ్యానించారు.