కడప,డిసెంబర్ 26: మాజీ ఎంపీ మైసూరారెడ్డి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లు రాయలాసీమ పై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అంతేకాక రాయలసీమపై జరుగుతున్న అన్యాయం పై మాజీ ఎమ్మెల్యేలు శివ రామకృష్ణ , మదన్మోహన్ రెడ్డిలతో కలిసి జగన్, చంద్రబాబులకు లేఖలు రాశారు. నీటి పంపకాల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎక్కువగా నష్టపోయింది రాయలసీమనే అని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని, హైకోర్టు వోకేచోట నిర్మించి రాయలసీమకు అన్యాయం చేశారని విమర్శించారు. అంతేకాకుండా నదిజలాల పంపాకాల విషయంలో సీమ ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో జగన్ పోరాడకపోవడం దురదృష్టకరమని మైసూరారెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తున్న శేతపత్రంలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని మాజీ ఎంపీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తెలిపారు.