న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు భాజపాలో కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన నిఘా విభాగం ఉన్నతాధికారుల భేటీలో గడ్కరీ మాట్లాడుతూ..పార్టీ అభ్యర్థుల వైఫల్యానికి పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయకపోతే ఆ బాధ్యత ఎవరిది? నాదే కదా! అన్నారు.
అంతకుముందు వొక సందర్భంలో ‘విజయానికి చాలా మంది తండ్రులుంటారు.. పరాజయం మాత్రం అనాథని అన్నారు. గెలుపు లభించినప్పుడు అది తమ ఘనతేనని అందరు ప్రకటించుకుంటారు. కాని ఓటమి ఎదురైతే ఎదుటి వారే కారణమన్నట్లు వొకరినొకరు వేలెత్తి చూపుతారు అని పేర్కొన్నారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం అనంతరం గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై ఆయన ప్రత్యక్ష దాడేనని పలువురు భావిస్తున్నారు.