అమరావతి, జూలై 27: ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 31న ఏపీ సీఎంతో సమావేశం కానున్నారు. గతంలో ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసించేందుకు వెళ్లినపుడు మెడికల్ స్కూల్ వైద్యులతో ఈ సమస్యపై చర్చించారు. దీనిపై అక్కడి అధికారులు మాట్లాడుతూ మెడికల్ స్కూల్ ముఖ్య వైద్యుడు జోసెఫ్ బెన్వంత్రీ నేతృత్వంలోని బృందం ఉద్దానంలో పర్యటించి సమస్యకు కారణాలు వెలువరించడంతో పాటు అక్కడ కిడ్నీ వ్యాధులకు సంబంధించిన పరిశోధన, వైద్యకేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 29న జోసెఫ్ వైద్య బృంద ఉద్దానం పర్యటన ఖరారైంది. ఆ తరువాత విశాఖపట్నంలో హార్వర్డ్ వైద్యులతో పవన్ సమావేశమవుతారు. 31వ తేదీన పవన్, వైద్యులు ముఖ్యమంత్రిని కలిసి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఆయనకు తెలపనున్నారు.