లక్నో, డిసెంబర్ 26 : ఉత్తర్ప్రదేశ్ సంభాల్ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్లను విమర్శించినందుకు ఓ దివ్యాంగుడిపై బీజేపీ నేత దాడి చేసి, కర్రతో చావబాదాడు. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితుడు మనోజ్ గుజ్జార్ నేను మాజీ సీఎం అఖిలేష్ యాదవ్కు ఓటు వేస్తానని చెబుతూ ప్రధాని మోదీని, సీఎం యోగిలను విమర్శించడంతో అక్కడే ఉన్న బీజేపీ నేత మహ్మద్ మియాన్ అతన్ని కర్రతో కొట్టి హింసించాడు.
దివ్యాంగుడైన గుజ్జార్ను బీజేపీ నేత కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మియన్పై అస్మోలి పోలీస్ స్టేషన్లో ఇంతకు ముందే రౌడీ షీట్ ఓపెన్ చేశారని, ఆయనకు నేరచరిత్ర ఉందని సంభాల్ ఎస్పీ వెల్లడించారు. కాగా సీనియర్ బీజేపీ నేతలపై గుజ్జర్ అమర్యాదకరంగా మాట్లాడటంతో తాను సహనం కోల్పోయి అతడిపై దూషణలకు దిగానని, దీనిపై అతనికి బహిరంగ క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధమని మియన్ పేర్కొన్నారు.