అమరావతి, డిసెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వాల రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, సాధించిన ప్రగతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్ధులకు కాస్మొటిక్ ఛార్జీలను పెంచామని, విదేశాల్లో చదువుకోవాలనుకనే వారికి రూ. 15 లక్షల ఆర్ధిక సాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. తాము చేసిన కృషికి అనేక పురస్కారాలు లభించాయని సియం పేర్కొన్నారు. ఆదరణ పథకం కింద పెద్ద ఎత్తున పనిముట్లను అందిస్తున్నామని ,ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు లేకుండా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. అంబేద్కర్ స్పూర్తితో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, ఆర్దిక ఇబ్బందులున్నా రుణమాఫీ చేశామని, సంపద సృష్టించకుండా పేదరికం పోదని అన్నారు.