హైదరాబాద్, జూలై 27 : నగరంలో పెరిగిపోతున్న ధ్వని కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగర పోలీస్ కమిషనర్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ధ్వని కాలుష్యం నియంత్రణ నిబంధన 2000 రూల్ 8 ప్రకారం ఈ నెల 27 వతేదీ గురువారం ఉదయం ఆరుగంటల నుంచి ఆగస్టు నెల పదో తేదీ ఉదయం ఆరుగంటల వరకు హైదరాబాద్ నగరంలోని రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడం, లౌడ్ స్పీకర్లు పెట్టడాన్ని నిషేధించారు. నగరంలో ధ్వని కాలుష్యం 20 డెసిబుల్స్ కంటే ఎక్కువ పెరిగిందని కమీషనర్ పేర్కొన్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ ధ్వనులు, బాణసంచా కాల్చడం, లౌడ్ స్పీకర్లు వీటి వల్ల ధ్వని కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుండడంతో ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. కాగా ఎవరైనా ఫంక్షన్ లలో లౌడ్ స్పీకర్లు పెట్టాలనుకుంటే నగర డీసీపీల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని, ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188, సెక్షన్ 67 (సి), సెక్షన్ 76 పోలీసు యాక్ట్ ల కింద కేసును నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.