అమరావతి, డిసెంబర్ 25: రాష్ట్రంలో చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలకు ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ప్రస్తుతం ఉచితంగా వైద్యసేవలు అందుతున్నప్పటికీ చేనేత కుటుంబాలకు ఔట్ పేషెంట్ సేవల(ఓపీడీ)ను కూడా ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురానుంది. 2014 వరకూ కేంద్ర ప్రభుత్వం చేనేతల కోసం అమలు చేసిన ఆరోగ్య బీమా పథకాన్నే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించనుంది. దీనిలో భాగంగా గతంలో రూ.15 వేల వరకూ ఉచితంగా ఓపీ సేవలు పొందే వెసులుబాటు ఉండగా ఇప్పుడు దాన్ని రూ.20 వేలకు పెంచింది. కొత్తగా తీసుకురానున్న పథకానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించనుంది.