అమరావతి, డిసెంబర్ 25: తాడేపల్లి గూడెం నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు త్వరలో తన పదవికి రాజీనామా చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. తాడేపల్లి నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. గత కొంతకాలంగా నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేద్దామని ప్రయత్నించినా టీడీపీలోని కీలక నేతలు అడ్డుపడుతున్నారంటూ మాణిక్యాలరావు ఆరోపించారు. 15 రోజుల్లో తాడేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తానని లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే ఈ వాఖ్యలకు విని మాణిక్యాలరావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు చెయ్యడం మానుకోవాలని హితవు పలికారు.
రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదన్నారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గాన్ని మాత్రమే కాదని రాష్ట్రం మెత్తాన్ని అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ రాజీనామా చెయ్యడం కాదని, పోలవరంపై కేంద్రంతో పోరాడి రాజీనామా చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా కంచుకోట అని చంద్రబాబు తెలిపారు. ఆ జిల్లాను అభివృద్ధి పథంలో తాను నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ రాజీనామాలు చెయ్యడం సరికాదన్నారు.