కలకత్తా, డిసెంబర్ 24: బీజేపీ పశ్చిమబెంగాల్ లో చేపట్టాలనుకుంటున్న రథయాత్రకు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. రథయాత్రకు సంబంధించిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని... దీన్ని కూడా సాధారణ పిటిషన్ గానే భావిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, మమతను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో పోల్చారు. కిమ్ లా మమత వ్యవహరిస్తున్నారని... ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని చంపేస్తున్నారని మండిపడ్డారు.