కలకత్తా, డిసెంబర్ 24: ప్రాంతీయ పార్టీలను బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కూడగట్టి, ఓ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో నిన్న భువనేశ్వర్ కు వెళ్ళిన కేసీఆర్, నేడు భువనేశ్వర్ నుంచి కోల్ కతాకు చేరుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. కేసీఆర్ నిన్న భువనేశ్వర్ వెళ్ళి వొడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో కూటమిపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆపై రాత్రికి అక్కడే బస చేసిన ఆయన, ఈరోజు మధ్యాహ్నం నుంచి కోల్ కత్తాకు బయలుదేరనున్నారు.
సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమై, కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఆపై ఆయన కలకత్తా కాళికామాత ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లే కేసీఆర్, రెండు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి, పలు ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, తన పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్న కేసీఆర్, కేంద్ర ఎన్నికల కమిషనర్ తోనూ సమావేశం కానున్నారు. అయితే ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను కేసీఆర్ కలుస్తారు.