హైదరాబాద్, డిసెంబర్ 23: నగరంలో నెక్లెస్ రోడ్ లోని పివి ఘాట్ లో ఈ రోజు మాజీ ప్రధాని పివి.నరసింహారావు 14వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి తలసాని నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ భారత దేశం నుండి మొట్టమొదటి ప్రధానిగా పనిచేసిన పి.వి.నరసింహారావును సొంత పార్టీ నేతలే అవమానించారని కేవలం దక్షిణాది వ్యక్తి కావడం వల్లే ఆయన స్మారక చిహ్నాన్ని ఇప్పటివరకు దేశ రాజధాని డిల్లీలో ఏర్పాటు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించిన పివికి ఆ పార్టీ మాత్రం అన్యాయం చేసిందని తలసాని వ్యాఖ్యానించారు.
మైనారిటీ ప్రభుత్వాన్ని తన రాజకీయ చతురతతో 5 ఏళ్ల పూర్తికాలం నడిపిన గొప్ప వ్యక్తి పివి అంటూ కొనియాడారు. అలాంటి వ్యక్తి మన తెలుగు నేలపై పుట్టి దేశ ప్రధానిగా పనిచేయడం గర్వకారణమన్నారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి పివి దేశ ఆర్ధక వ్యవస్థను గాడిలో పెట్టారని తలసాని గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని పివి సేవలకు తెలంగాణ ప్రభుత్వంలో గుర్తింపు లభించిందని తలసాని పేర్కొన్నారు