హైదరాబాద్ , డిసెంబర్ 22 : నందమూరి అభిమానులే కాక యావత్ తెలుగు ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘యన్.టి.ఆర్ ట్రైలర్ వచ్చేసింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను శుక్రవారం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఆడియో వేడుకలో బాలకృష్ణ 4తోబుట్టువులయిన ఎన్టీఆర్ కుమార్తెలు విడుదల చేశారు.
ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ వొదిగిపోయారు.అచ్చం ఎన్టీఆర్ను తలపించారు . ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన కాసేపటికే పది లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. నాటి తరం వారు ఎవరైనా ఈ ట్రైలర్ను చూస్తే బాలకృష్ణను చూసి ఎన్టీఆరే అని భావించకమానరు. ఎన్టీఆర్గా బాలయ్య బ్రహ్మాండంగా కుదిరారనిపిస్తుంది.
అన్న జీవిత గాధని ‘కథానాయకుడు , ‘మహానాయకుడు అనే రెండు భాగాలుగా విడుదల చెయ్యనున్నారు . అయితే, రెండు సినిమాలకు కలిపి వొకే ట్రైలర్ను డిజైన్ చేయడం విశేషం. కలెక్షన్ కింగ్ మోహన్బాబు, దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ,నందమూరి కల్యాణ్ రామ్,రానా దగ్గుబాటి, సుమంత్,నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించిన ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు అందించగా కీరవాణి సంగీతం సమకూర్చారు.
తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ గులాంలకి సలాం కొడుతున్న సమయం లో , తనను అగ్ర స్థాయిలో నిలిపిన ప్రజల బాగుకోసం ముందుకొచ్చి తన శేష జీవితాన్ని ప్రజలకోసం అంకితం చేసిన యుగపురుషుడి జీవిత గాధను జనవరి 9 ఫిబ్రవరి 7 తేదీదలో రెండు భాగాలుగా విడుదల చెయ్యనున్నారు .