న్యూఢిల్లీ, జూలై 26 : ఇటీవల గుజరాత్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బనాస్కాంఠా, పఠాన్ జిల్లాల పరిధిలో వేల మంది ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం మధ్యాహ్నం వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, అధికారుల సమావేశంలో అక్కడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర ప్రకృతి విపత్తు నివారణ నిధి కింద తక్షణం రూ.500 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల సాయం అందజేస్తామని ఆయన అన్నారు. గుజరాత్లో గత 24 గంటల వ్యవధిలో ఎనిమిది మంది మరణించడంతో మొత్తం వరద మృతుల సంఖ్య 82కు చేరుకున్నది. 36 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిలో 1600 మందిని రక్షించారు.