రాయపూర్, డిసెంబర్ 20: ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సంచార్ క్రాంతి యోజన పథకం కింద రాష్ట్రంలో 5 మిలియన్ల కుటుంబాలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని సీఎం రమణ్ సింగ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీజేపీ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి భూపేష్ కొత్త సీఎం అయ్యారు. స్మార్ట్ ఫోన్ల పంపిణీ టెండరు వ్యవహారంపై పలు అనుమానాలున్నందున దీన్ని పరిశీలించేందుకు వీలుగా ఈ పథకాన్ని నిలిపి వేయాలని కొత్త సీఎం ఆదేశించినట్లు అధికారులు చెప్పారు.
ఇప్పటికే రెండు మిలియన్ల మందికి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారని, ఈ ఫోన్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతోపాటు ఫోన్ లో రమణ్ సింగ్ ఫోటో డిస్ ప్లే అవుతున్నందున దీన్ని నిలిపి వేశారు. ఈ ఫోన్లు వేడెక్కి సజావుగా పనిచేయడం లేదని తేలినందున దీన్ని నిలిపివేశామని సీఎం కార్యాలయ అదికారి చెప్పారు.