న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 2016 నవంబర్ 8న పాత పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారు. కొత్త నోట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడ్డారు. రాత్రికి రాత్రి ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో అనేక మంది ఆవేదనతో మృత్యువాతపడ్డారు. అయితే ఈ వ్యవహారంపై తొలిసారిగా ప్రభుత్వం స్పందించింది. డిమానిటైజేషన్ నిర్ణయంతో ప్రజలు పడ్డ అవస్థలు నిజమేనని, ఈ సందర్భంగా దేశంలో కేవలం నలుగురు మాత్రమే చనిపోయారని ఆర్ధిక మంత్రి అరుణ్ జెట్లీ ప్రకటించారు.
రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ ఈలమారన్ కరీం అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి సమాధానమిచ్చారు. నోట్ల రద్దు సమయంలో కేవలం నలుగురు మాత్రమే చనిపోయారని సభలో ప్రకటించారు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ముగ్గురు సిబ్బంది, వొక ఖాతాదారుడు మాత్రమే చనిపోయినట్లు ప్రకటించారు. వారందరికి నష్టపరిహారం కూడా చెల్లించామని అరుణ్ జైట్లీ రాజ్యసభలో తెలిపారు