ప్రకాశం, డిసెంబర్ 19: ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సన్నిహితుడు చంద్రశేఖర్ యాదవ్ జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడ చర్చించారు. పవన్ కళ్యాణ్ కూడ చంద్రశేఖర్ యాదవ్ చేరికకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2009 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ యాదవ్ ఆ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖర్ యాదవ్ జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.
జనసేన పార్టీలో చేరాలని చంద్రశేఖర్ ను ఆ పార్టీ నేతలు సంప్రదించగా, చంద్రశేఖర్ కూడ సానుకూలంగానే స్పందించారు. పవన్ కళ్యాణ్తో కూడ ఆయన సమావేశమై పార్టీలో చేరే విషయంపై చర్చించారు. చంద్రశేఖర్ యాదవ్ చేరికకు పవన్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వొంగోలులోని తన కార్యాలయాన్ని జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖర్ యాదవ్ నిర్ణయం తీసుకొన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ ప్రవాసాంధ్ర సదస్సు నుండి తిరిగి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ యాదవ్ జనసేనలో చేరనున్నారు.