న్యూఢిల్లీ, జూలై 26: సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆగస్టు 27న పదవి విరమణ చేయనున్న సందర్భంగా తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించాలన్న దాని పై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఆయనకు లేఖ రాశారు. అయితే, తన వారసుడిగా ఈ పదవికి జస్టిస్ మిశ్రా పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ సిఫారసు చేశారు. న్యాయమూర్తుల్లో అత్యంత అనుభవజ్ఞుడిని సీజేఐగా నియమించాలని విధాన ప్రక్రియ (ఎంవోపీ) చెబుతోంది. జస్టిస్ ఖేహర్ తర్వాత అత్యంత అనుభజ్ఞుడిగా జస్టిస్ మిశ్ర (63) నిలుస్తారు. ఆయన 2018 అక్టోబరు 2న పదవి విరమణ చేస్తారు.