హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. మంత్రివర్గ కూర్పుపైనా, శాసనసభాపతి, ఉపసభాపతి ఎంపికపైనా కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ తరపున ఎన్నికైన 88 ఎమ్మెల్యేలతో పాటు ఫార్వార్డ్ బ్లాక్ సభ్యుడు, వొక స్వతంత్ర అభ్యర్థి పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ బలం 90కి చేరింది. దీంతో పాటు 30 మంది ఎమ్మెల్సీల వివరాలు తెప్పించి వీరి బలాబలాలు, గుణగణాలు, సమర్థత ఇతర విషయాలపై సీఎం అధ్యయనం ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు, సమస్యలను తీరుస్తారని నమ్మకమున్న వారికి కేబినెట్ లో చోటు వరించనుంది. పార్టీకి నమ్మకస్తులు, విధేయులనే మంత్రివర్గంలోకి తీసుకోవాలని, వారి పనితీరుని బట్టి ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో పాటు పాత మంత్రుల్లో సమర్థవంతంగా పనిచేసిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.