హైదరాబాద్, డిసెంబర్ 18: వచ్చే ఏడాది జరుగవలసిన సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ఖరారయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, వొడిసా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించబడతాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2019 అక్టోబరులో జరుగవలసి ఉంది. వీలైతే ఆ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలను ముందుగా రద్దు చేసి వాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ పై కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్ర ప్రభుత్వం చర్చిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.