కర్ణాటక, డిసెంబర్ 15: కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సుళవాడిలో శుక్రవారం విషం కలిపిన ప్రసాదం తిని 11 మంది మృతి చెందారు. అమ్మవారి ప్రసాదం వారి పాలిట మృత్యు పాశమైంది. గ్రామంలో జరిగిన మారెమ్మ ఆలయం గోపురం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. పుణ్యం ప్రాప్తిస్తుందని అమ్మవారి ప్రసాదాన్ని ఆరగిస్తే విషాహారంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాదంలో క్రిమిసంహారక మందు కలవడమే కారణమని తేల్చారు.
ఓ వర్గం పథకం ప్రకారం ప్రసాదంలో పురుగు మందు కలిపినట్టు అనుమానిస్తున్నారు. గోపుర నిర్మాణం విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదమే ఇందుకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిద్దరి నడుమ ఇటీవల గోపురం నిర్మాణానికి సంబంధించి భూ వివాదం తలెత్తినట్లు తెలిసింది. ఈ కక్షల కారణంగానే విషం కలిపి ఉంటారని భావిస్తున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి చిన్నప్ప, మహాదేవ అనే ఇద్దర్ని అరెస్టు చేశారు.