విజయవాడ, డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పేరెత్తడానికే భయపడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ కారణంగానే ముంపు మండలాలపై లేనిపోని పంచాయతీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వేస్తున్న కేసులను అడ్డుకోవాలిగాని, ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నదుల అనుసంధానం చేసి, కృష్ణానీటిని పులివెందులకు ప్రవహింపజేస్తున్న విషయం జగన్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో కూర్చుని ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం సహాయ అందించకపోయిన పోలవరంను పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ కారణంగా ఎటువంటి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులందరు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.