కొడంగల్, డిసెంబర్ 13: కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తనకు భద్రత వద్దని సిబ్బందిని వెనక్కు పంపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరుణంలో తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని రేవంత్ పోలీసులకు చెప్పారు. ఈ సందర్బంగా ఆయనకు కల్పించిన 4 ప్లస్ 4 భద్రతను అధికారులు రద్దుచేశారు. ఈ విషయంపై వికారాబాద్ జిల్లా ఎస్పీ అవినాశ్ మెహంతీ మాట్లాడుతూ.. స్వయంగా రేవంత్ రెడ్డి తనకు భద్రత సిబ్బంది వద్దని చెప్పారని తెలిపారు. హైకోర్టు కూడా తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యేవరకే రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని తమని ఆదేశించిందన్నారు. రేవంత్ నిర్ణయంతోనే మేము భద్రతను వెనక్కు తీసుకున్నామని తెలియచేశారు.