విజయవాడ, డిసెంబర్ 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఆంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే... ఏపీలో అధికార టీడీపీ 150 సీట్లలో విజయం సాధించడం ఖాయమన్నారు. ఎవరూ చేయని విధంగా సీఎం చంద్రబాబు ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారన్నారు. ఏపీనీ మోసం చేసిన మోదీకి... 2019లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. తెలంగాణలో మోదీ, షా వంటి వారు ప్రచారం చేసిన వొక్క స్థానం మాత్రమే దక్కిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అడ్రస్ గల్లంతయ్యిందన్నారు.
ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్పై కూడా బోండా ఉమా కామెంట్స్ చేశారు. తెలుగు ప్రజల్ని అవమానించేలా మాట్లాడుతున్న పార్టీలతో జగన్ పొత్తుపెట్టుకున్నారన్నారు. ఏపీనీ మోసం చేసిన బీజేపీతో రహస్య వొప్పందం చేసుకున్న జగన్కు కూడా ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పధకాలకే పట్టం కడతారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.