బెంగళూరు , డిసెంబర్ 10 :మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వ లక్షణాలను కొనియాడారు. ‘ప్రధాని మోదీని ఎదుర్కోగల వొకే వొక్క శక్తివంతమైన లీడర్ దీదీయే. రానున్న లోక్సభ ఎన్నికల్లో మోదీకి ధీటుగా బరిలో నిలబడగల సత్తాగల నేత మమతా వొక్కరే అని యశ్వంత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయగల సత్తా ఉన్న నాయకురాలు మమత. రాజకీయ చతురత, ధైర్యం ఉన్న నాయకురాలు. దేశ ప్రధాని కావడానికి ఆమెకు పుష్కలమైన నాయకత్వ లక్షణాలున్నాయి అని వ్యాఖ్యానించారు.
జాతీయ స్థాయి రాజకీయాల్లో తృణమూల్ పార్టీ ప్రభావం చూపగలదని.. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు బెంగాల్ రాష్ట్రంలోనే వున్నాయని అన్నారు. అనంతరం మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎంతో కీలకమైన మంత్రిమండలిని మోదీ పక్కన పెట్టారని విమర్శించారు. మంత్రులకు తెలియకుండా కొన్ని నిర్ణయాలు ఆయన సొంతగా తీసుకుంటున్నారని ఆరోపించారు. మమత ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. జనవరిలో బెంగాల్లో జరిగే భారీ ర్యాలీకి అన్ని పార్టీల నేతలను ఆమె ఆహ్వానిస్తున్నారు.