చెన్నై, డిసెంబర్ 8: చెన్నైలోని అన్నానగర్ పోలీసు స్టేషన్లో తమిళ నటుడు ‘పవర్ స్టార్ శ్రీనివాసన్ అదృశ్యమైనట్లు ఆయన భార్య జూలీ ఫిర్యాదు చేసారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. సినీ నటుడు ‘పవర్ స్టార్ శ్రీనివాసన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులో అలాగే దిల్లీ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులలో ఆయన అరెస్టయ్యారు. ఇటీవల కొందరిదగ్గర నగదు మోసం చేసినట్లు కూడా ఫిర్యాదు నమోదైంది.
ఈ నేపథ్యంలో ఆయన అదృశ్యమైనట్లు భార్య జూలీ సమీపంలోని అన్నానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన విచారణలో ఆయన ఊటీలో ఉన్నట్లు సమాచారం తెలిసింది. నేను క్షేమంగానే ఉన్నాను, ఓ పనిపై ఊటీ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ విషయం తెలుసుకొన్నఆయన భార్య కూడా అక్కడికి వెళ్లారు. తర్వాత తాను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.