శ్రీకాకుళం,డిసెంబర్ 6: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటివరకూ 3,390.3 కిలోమీటర్లు నడిచారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది. జిల్లాలోని రెడ్డిపేట శివారులో ఈరోజు ఉదయం 314వ రోజు జగన్ పాదయాత్ర మొదలయింది. ఆ తరువాత లోలుగు, నందివాడ క్రాస్, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగనుంది.
పాదయాత్రలో భాగంగా జగన్ చిలకల పాలెం వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం ఎచ్చెర్ల వద్ద రాత్రికి విశ్రాంతి తీసుకోనున్నారు. పాదయాత్రకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేసారు.