హైదరాబాద్, డిసెంబర్ 02 : మంత్రి కేటిఆర్ చాలా హుందాగా మాట్లాడుతారనే మంచి పేరుంది. కానీ నిన్న ఆయన నోటి నుంచి ఎవరూ ఊహించలేని మాటలు వినబడటంతో అందరూ షాక్ అయ్యారు. నగరంలో నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ “హైదరాబాద్లో నాలుగు బిల్డింగులు కట్టిస్తే అదేదో చాలా గొప్ప విషయమన్నట్లు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆలెక్కన కేంద్రంతో కోట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ మరెంత గొప్పవారు? ఇద్దర్లో ఎవరు గొప్ప? తెలంగాణకు నేనేమీ అన్యాయం చేశానని చంద్రబాబు కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్నారు. కానీ ఏవిషయంలో ఆయన తెలంగాణకు అన్యాయం చేయలేదో చెప్పగలరా? తెలంగాణ ఏర్పాటు మొదలు, హైకోర్టు విభజన, మా ప్రాజెక్టులను అడ్డుకొంటూ కేంద్రానికిలేఖలు వ్రాయడం వరకు ప్రతీపనికీ చంద్రబాబు అడ్డుపడుతూనే ఉన్నారు. మాకు అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూనే ఉన్నారు. పైగా ఇప్పుడు మా రాష్ట్ర రాజకీయాలలో కూడా వేలుపెడుతున్నారు.
ప్రజాకూటమి ద్వారా మా రాష్ట్రాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కుట్రలు చేస్తున్నారు. డబ్బును, మీడియాను అద్దం పెట్టుకొని రెచ్చిపోతున్నారు. చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకొంటున్నారు. కానీ ఆయనకు ఎప్పుడు, ఏవిధంగా బుద్ధి చెప్పాలో కేసీఆర్కు బాగా తెలుసు. వొకసారి అమరావతికి తరిమికొట్టారు. ఇకనైనా చంద్రబాబు తన తీరు మార్చుకోకపోతే ఆయన చేస్తున్న పనే మేము చేయవలసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మేము వేలుపెడతాం. రాజకీయాలలో మరి కనబడకుండా అంతుచూస్తాం,” అని హెచ్చరించారు.