హైదరాబాద్, నవంబర్ 26: యూత్ని టార్గెట్ చేస్తూ మరో బోల్డ్ మూవీ తెరపైకి రాబోతుంది. “కొత్తగా మా ప్రయాణం” పేరుతో ప్రియాంత్ని హీరోగా పరిచయం చేస్తూ యూత్ఫుల్ రొమాంటిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి `ఈ వర్షం సాక్షిగా` ఫేం రమణ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను విడుదల చేసింది.
టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు రమణ మాట్లాడుతూ.. నెలకు రూ. 2 లక్షల జీతం అందుకునే సాఫ్ట్వేర్ కుర్రాడి కథ ఇది. నలుగురికి సాయపడుతూ ఓపెన్ మైండెడ్గా ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతడికి ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అంతగా నమ్మకం ఉండదు. అయితే అలాంటివాడు మన సంప్రదాయం విలువను, గొప్పతనాన్ని ఎలా తెలుసుకున్నాడనేది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం అన్నారు. ప్రియాంత్కి తొలి సినిమానే అయినా చక్కగా నటించాడని కితాబిచ్చారు. హీరోయిన్ యామిని భాస్కర్ అందాలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని తెలిపారు. ఈ చిత్రంతో హీరో హీరోయిన్కి మంచి పేరొస్తుందని అన్నారు. యువత లక్ష్యంగా తీసిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తామని తెలిపారు.