హైదరాబాద్,, నవంబర్ 25: ఈ నెల 29న శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా2 పాయింట్ 0 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇంతపెద్ద సినిమా రిలీజ్ అయిన తరువాతి రోజే రామ్ గోపాల్ వర్మ ప్రమోట్ చేస్తోన్న భైరవగీత విడుదల కానుంది. ఏ సందర్భానైనా తన సినిమా ప్రమోషన్ కోసం వాడేసుకునే వర్మ, 2 పాయింట్ 0ను కూడా భైరవగీత ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడు.
తాజాగా ప్రీ రిలీజ్ పార్టీలో పాల్గొన్న వర్మ.. 2 పాయింట్ 0 చిన్న పిల్లల సినిమా అంటూ తనదైన స్టైల్లో వివాదానికి తెర తీశాడు. ‘పెద్ద స్టార్లతో పెద్ద డైరెక్టర్ తీసిన చిన్న పిల్లల సినిమా 2 పాయింట్ 0, చిన్న పిల్లాడు అయి సిద్ధార్థ్ తీసిన అడల్ట్ సినిమా భైరవగీత. పిల్లల సినిమా చూస్తారా.? పెద్దల సినిమా చూస్తారా? అంటూ అభిమానులను ప్రశ్నించాడు.