హైదరాబాద్, నవంబర్ 24: ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ వొవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎవరైనా.. మజ్లిస్ పార్టీ ముందు తలవంచాల్సిందే అంటు కార్యకర్తల సమావేశంలో ఉద్రేకంగా ప్రసంగించారు. చంద్రబాబు దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ప్రస్తుత సీఎం కేసీఆర్ వరకు మా ముందు తలవంచాల్సిందే.. మా మాట వినాల్సిందే అని అన్నారు. 11వ తేది తరువాత మజ్లిస్ పార్టీ సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు.
హైదరాబాద్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను కింగ్ కాదనీ, కింగ్ మేకర్ ననీ చెప్పారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు మరింత సున్నితంగా తయారు అయ్యాయనీ, ఈ సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కాగా, అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.