హైదరాబాద్, నవంబర్ 22: కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఇటీవల వొక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనదైన శైలిలో ఎన్నికలపై స్పందించారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీరు నాకు పుల్లారెడ్డి స్వీట్లు ఇవ్వాలి. వొకవేళ కాంగ్రెస్ ఓడిపోతే నేను గొంతు కోసుకుంటా.. డిసెంబర్ 11న చానల్ ఆఫీసులోనే గొంతుకోసుకుంటా.. అని శపథం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ఏ పదవీనీ ఆశించనని అన్నారు. తెలంగాణ కళకళ్లాడాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంటున్న కేటీఆర్ సవాలును కాంగ్రెస్ నేతలు స్వీకరిస్తారా అని అడగ్గా బండ్ల పైవిధంగా స్పందించారు. ‘సన్యాసం కాదు, ఆత్మహత్య చేసుకుంటా.. అని అన్నారు.
టీఆర్ఎస్ నేతలు తప్పుడు వాగ్దానాలు చేశారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్ ఓడిపోతున్నారని, ప్రజా నాయకుడైన హరీశ్ రావు గెలవబోతున్నారని పేర్కొన్నారు. బండ్ల గణేశ్ కామెడీ చేయరని, సీరియస్ అని అన్నారు. తనకు రాజేంద్ర నగర్ టికెట్ రానందుకు పెద్ద బాధేమీ లేదని చెప్పుకొచ్చారు. రాజేంద్ర నగర్ టికెట్ ఆశించిన బండ్ల గణేశ్కు కాంగ్రెస్ ఆ అవకాశం ఇవ్వకుండా అధికార ప్రతినిధి పోస్ట్ ఇవ్వడం తెలిసిందే.