అమరావతి, నవంబర్ 22: అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీకి సిద్ధమైన బాధితులు ‘ఛలో హాయ్ల్యాండ్ పేరుతో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ప్రభావం వల్ల గుంటూరు అర్బన్ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బాధితులు హాయ్ల్యాండ్ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తాము తలపెట్టిన హ్యాయ్ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని బాధితులు కోరినా.. ముట్టడిని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న బాధితులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.