ప. గో. జి, నవంబర్ 19: జిల్లా మండలం పాలకొల్లు లోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం కావడంతో భక్తులు స్వామికి పూజలు చేయడానికి భారీ సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణంలోని మహిషాసుర మర్ధిని అమ్మవారికి పూజలు చేస్తున్న పూజారి నాగబాబు వొక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే తేరుకున్న భక్తులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆలయాన్ని మూసివేశారు.
పూజారి చనిపోవడంతో దర్శనాలు, పూజాకార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సాయంత్రం వరకు భక్తులు ఎవరు దర్శనానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. సంప్రోక్షణ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుస్తారని అధికారులు తెలిపారు.