ప్రజలకు దిమ్మతిరిగే హమీలిచ్చిన బిజేపి

SMTV Desk 2018-11-17 18:15:31  BJP, Assembly elections,

మధ్యప్రదేశ్, నవంబర్ 17: రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల వారు తమకు తోచిన విధంగా ప్రజలకు మతిపోయే హామిలిస్తూనే వున్నారు. తాజాగా తాము ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రానికి మెట్రో రైలు, పది లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌‌లు ఈ రోజు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ‘మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2003 వరకూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అది చేసిందేమీ లేదు. రాష్ట్రంలో తాగునీరు, రోడ్లు, కరెంట్ వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు.. 2003లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి జరిగింది.. ఇప్పుడు మరోసారి బీజేపీ గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం.. అని చెప్పుకొచ్చారు.

బీజేపీ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే గ్వాలియర్‌, జబల్‌పూర్‌ నగరాలకు మెట్రో రైలు సౌకర్యం తీసుకొస్తామని, ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలికలకు స్కూటీ ఇస్తామని, రాష్ట్రంలో మిని స్మార్ట్‌ సిటీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఈనెల 28న 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 11న ఫలితాలు వెలువడనున్నాయి.