కేరళ, నవంబర్ 16: శబరిమల ఆలయ వివాదంపై సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చినా, అక్కడి పురుష భక్తులు మహిళలను అడ్డుకోవడంతో వారు ఆలయంలోకి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అయితే నవంబర్ 17 నుంచి శబరిమలలో ప్రారంభం కానున్న మండల మక్కరవిళ్లక్కు‘ సీజన్ రెండు నెలలపాటు కొనసాగనుంది. భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ శబరిమలకు వెళుతున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ రోజు ఉదయం పుణె నుంచి కేరళ చేరుకున్న తృప్తి దేశాయ్ రేపు శబరిమలకు వెళ్ళనున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బ తియ్యటానికే తృప్తి ఈ పని చేస్తోందని అయ్యప్ప భక్తులు అన్నారు. ఆమెను ఆలయంలోకి ప్రవేశించనివ్వమని ఇప్పటికే ప్రకటించారు. శబరిమలకు వచ్చి ఆమె లేని వివాదాలను రేపొద్దని, ఆమె వెనుదిరిగాలని హెచ్చరికలు కూడా జారీ చేశాయి భక్త సంఘాలు. నేటి సాయంత్రం ప్రధాన పూజారులకు బాధ్యతల అప్పగిస్తారు. మండపూజ, మకరవిళక్కు సందర్భంగా సాయంత్రం 5 గంటల తరువాత ఆలయం తలుపులు తెరచుకోనున్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని నీలక్కల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో వేలాదిగా పోలీసు బలగాలు మోహరించి వున్నాయి.
ఈ నేపథ్యంలో తృప్తి రాక పలు ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం వుంది. అయితే, తనకు భద్రత కల్పించాలని ఆమె, కేరళ సర్కారును కోరినా, ఇప్పటివరకు కేరళ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అయినా, తన ప్రయాణం ఆగదని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు.