నవంబర్ 16: మహిళల హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత్ పోరు ముగిసింది. రెండో రౌండ్లో పీవీ సింధు అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 24-26, 20-22తో కొరియాకు చెందిన హున్ జీ సంగ్ చేతిలో పరాజయం పాలైంది. మొదటి గేమ్ లో సింధు గట్టిపోటీని ఇచ్చింది. మొదటి గేమ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగినా చివరకు పట్టుకోల్పోయింది. ఇక రెండవ గేమ్ లో హున్ జీ సంగ్ మెరుగైన ప్రదర్శన చేయడంతో సింధుకు నిరాశ తప్పలేదు. అంతకుముందు తొలిరౌండ్లోనే స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఇక పురుషుల సింగిల్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ విజయంను అందుకున్నాడు. దీంతో హాంకాంగ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 18-21, 30-29, 21-18తో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్పై విజయం సాధించాడు. 67 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.