హైదరాబాద్, నవంబర్ 15: ప్రముఖ తెలంగాణ తెదేపా నేత దేవేందర్ గౌడ్ సంస్థలపై ఈ రోజు ఉదయం నుండి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయనకు చెందిన ఇళ్ళు, డ్యూక్స్ బిస్కట్స్ కంపెనీ, స్థిరాస్థి కార్యాలయాలపై అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం 20 బృందాలు వొకేసారి ఆయన ఇళ్ళు, కంపెనీలలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ఉప్పల్ నుంచి టిడిపి అభ్యర్ధిగా ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న ఈ తరుణంలో ఐటి దాడులు చేయడంతో టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సంస్థలలో ఎటువంటి అక్రమ ఆర్ధికలావాదేవీలు జరుగడంలేదని కనుక ఐటి దాడులతో తమను భయపెట్టాలనుకోవడం అవివేకమని దేవేందర్ గౌడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఐటి దాడులు నిర్వహించినంతమాత్రన్న భయపడబోను వెనక్కు తగ్గనని వీరేందర్ గౌడ్ అన్నారు.