నేడు టిజేఎస్, సిపిఐ అభ్యర్దుల ప్రకటన

SMTV Desk 2018-11-14 12:40:37  Telangana janasamthi party, CPI, Election candidates list

హైదరాబద, నవంబర్ 14: మహాకూటమిలో వొకటైన తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీలు ఈ రోజు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని ఆ పార్టీల నేతలు కోదండరామ్‌, చాడా వెంకటరమణ నిన్న మీడియాకు వెల్లడించారు.
కోదండరామ్‌ మీడియాతో మాట్లాడుతూ, “మేము కాంగ్రెస్ పార్టీని 11 సీట్లు అడిగాము. వాటిలో మల్కాజ్‌గిరి, మెదక్‌, దుబ్బాక, సిద్దిపేట, వర్థన్నపేట, అంబర్‌పేట స్థానాలపై మాకు స్పష్టత వచ్చింది. కనుక ఆ ఆరు స్థానాలకు రేపు మా అభ్యర్ధులను ప్రకటిస్తాము,” అని చెప్పారు. జనగామ నుంచి తాను పోటీ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరామ్‌ చెప్పారు.

చాడా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ, “మేము కాంగ్రెస్ పార్టీని నాలుగు సీట్లు కోరాము. కానీ మూడు సీట్లే కేటాయించింది. మహాకూటమి లక్ష్యం నెరవేరడం కోసం మేము సర్దుకుపోవాలని నిర్ణయించాము. కనుక మాకు కేటాయించిన వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు రేపు మా అభ్యర్ధులను ప్రకటిస్తాము. అయితే నల్గొండ జిల్లాలో వొక సీటును మాకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందనే ఆశిస్తున్నాము,” అని చెప్పారు.