హైదరాబాద్, జూలై 22: టాలీవుడ్లో డ్రగ్స్ వాడకంపై పెద్ద వివాదమే తలెత్తినప్పటికీ, నోటీసులు అందిన ప్రతి ఒక్కరు విచారణలో అధికారులకు పూర్తిగా సహకరిస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు డ్రగ్స్ కేసులో తమ దర్యాప్తును ముమ్మరం చేసారు. డ్రగ్స్ మాఫియా విషయమై ప్రతి రోజు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు స్కూల్ మరియు టాలీవుడ్ను టార్గెట్ చేసిన సిట్ అధికారులు, అవి సరఫరా అయ్యే అసలు మూలాలపై దృష్టి సారించారు. అయితే హైదరాబాద్లో కొన్ని పబ్లు, బార్లు, హుక్కా సెంటర్లు, రిక్రియేషన్ సెంటర్లు, రెస్టారెంట్లు డ్రగ్స్ సప్లై కేంద్రాలుగా మారాయన్న విషయం విధీతమే. తాజాగా సిట్ విచారణలో కూడా ఇదే విషయం బయటపడేసరికి వాటిపై ఉక్కు పాదం మోపేందుకు రంగం సిద్ధం చేసారు అధికారులు. దానిలో భాగంగానే ఈ రోజు పబ్ మరియు బార్ల యజమానులతో సిట్ అధికారులు సమావేశం అయ్యారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నాయకత్వాన ఈ భేటీ కొనసాగుతుంది. మొత్తం 16 పబ్లకు నోటీసులు అందినప్పటికీ 15 పబ్బుల యజమానులు, మేనేజర్లు సమావేశానికి హాజరయ్యారు.