పారిస్, నవంబర్ 12: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఆదివారం 11/11/2018 తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ప్రపంచ దేశాల అధినేతలు ఆ యుద్దంలో వీర మరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు; కెనడా, ఇజ్రాయెల్ల ప్రధానులు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి, భారత ఉప రాష్ట్రపతి సహా మొత్తం 70 మంది నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న అన్నోన్ సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు) సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు.