హైదరాబాద్, జూలై 21: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 21 నుంచి జరగాల్సిన పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను తరువాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీని తాత్కాలికంగా వాయిదా వేయాలని బుధవారం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కాపీ అందగానే పరీక్షలు వాయిదా వస్తున్నట్లు టీఎస్పీఎస్సీ గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. గురుకుల టీచర్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి చేసిన కమిషన్, ఈ నెల 18నుంచి 22 వరకు మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఆ మేరకు 20వరకు పరీక్షలు నిర్వహించగా, 21న జరగాల్సిన టీజీటీ ఫిజికల్ సైన్స్, సోషల్, 22న నిర్వహించాల్సిన టీజీటీ సైన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.