ప. గో. జి, నవంబర్ 09: జిల్లా సిరిపురంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పూజలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం ఆలయానికి వచ్చిన భక్తులు ఆకాశ దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభ శిఖర భాగాన వేలాడదీసి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఆ సమయంలో శిథిలావస్థకు చేరుకున్న ధ్వజస్తంభం పైభాగం వొక్కసారిగా విరిగి భక్తులపై పడింది. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు సతీమణి వెంకటలక్ష్మి, తిబిరిశెట్టి భద్రలక్ష్మిల తలపై పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో భయాందోళనకు గురైన భక్తులు వొక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. గాయపడిన ఇద్దరు మహిళలను ఆలయ సిబ్బంది సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.