హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ జనసమితి పార్టీ ప్రారంభంలో 119 స్థానాలకు వొంటరిగా పోటీ చేద్దామని ప్రణాళిక సిద్దం చేసుకున్నప్పటికి, మహాకూటమిలో చేరి 8-10 స్థానాలకే పరిమితమవబోతోంది. ఆ స్థానాల్లోనే వొక స్థానం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేయబోతున్నారు. కానీ మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ తేలకపోవడంతో ఆయనతో సహా తెలంగాణ జనసమితి అభ్యర్ధులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై స్పష్టత రాలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం తెలంగాణ జనసమితి నేతల సూచనలు సలహాల మేరకు ప్రొఫెసర్ కోదండరామ్ పెదపల్లి జిల్లాలో రామగుండం నుంచి పోటీ చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి తెరాస తరపున సోమారపు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.