మీటూ పై సమావేశమైన నడిగర్‌ సంఘం

SMTV Desk 2018-10-30 14:53:35  Mee too, Nadighar sangham, Chinmay, Shruthihariharan, Leena manimegha, R V Uday kumar, Vishal, Karthi, Nazar

చెన్నై, అక్టోబర్ 30: దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మీటూ ఉద్యమం ఇప్పుడు
కోలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. పలువురు ప్రముఖ నటీమణులు సినీ నటులపై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు కోలీవుడ్‌ను ధిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గాయని చిన్మయి, నటి శృతీహరిహరన్, దర్శకురాలు లీనా మణిమేఘల వంటి వారు తాము అత్యాచారాలకు గురయ్యామని ప్రముఖులపై ఆరోపణలు చేయడంతో వారికి పలువురు మద్దతు పలుకుతున్నారు. మరి కొందరు ఎదురు దాడి చేస్తున్నారు.

సీనియర్‌ దర్శకుడు, నటుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ ఇటీవల వొక సినీ కార్యక్రమంలో మాట్లాడుతూ మీటూ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు మగవారి మధ్య సంబంధాలను, ఇద్దరు ఆడవారి మధ్య సంబంధాలను, అదే విధంగా ఆకర్షితురాలు అయిన మహిళతో మగవారు సంబంధాలు పెట్టుకోవచ్చునని చట్టమే చెబుతోంది అని ఆయన అన్నారు.

అదే విధంగా మరో నటుడు మారిముత్తు గీత రచయిత వైరముత్తు మహిళను కోరుకోవడంలో తప్పేముందీ? అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీరి వ్యాఖ్యలు వివాదాంశంగా మారుతున్నాయి. దీంతో మీటూ వ్యవహారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించుకున్న నడిగర్‌ సంఘం సోమవారం సాయంత్రం చెన్నైలోని నడిగర్‌ సంఘం ఆవరణలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సంఘ కార్యదర్శి విశాల్‌ ఇంతకు ముందే మీటూ వేధింపుల వ్యవహారంపై చర్చించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన వొక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఇతర కార్య నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీటూ వ్యవహారానికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అవేంటన్నది నిర్వాహకులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.