గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనే తెలుగుదేశం పార్టీ దృష్టి

SMTV Desk 2018-10-30 14:30:51  Nara lokesh, Gateway hotel, TDP Manifesto

విజయవాడ, అక్టోబర్ 30: నగరంలోని గేట్ వే హోటల్ లో గ్రామస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు అంశంపై నిర్వహించిన సదస్సుకు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ గ్రామీణ స్థాయి అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనే తమ పార్టీ దృష్టిసారించి అందుకు అనుకుణంగా అభివృద్ధి ప్రణాళికలు రచిస్తుందని వెల్లడించారు.

గ్రామాల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు 40 రకాల ప్రామాణికాలను అంచనా వేస్తున్నామని.. జియోట్యాగింగ్ ద్వారా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, పరిసరాలు, కుటుంబ ఆరోగ్యం, ఆదాయం తదితర అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించటంలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని ఆయన వెల్లడించారు.