హైదరాబాద్, అక్టోబర్ 29: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె శరీరం చికిత్సకు సహకరించడంలేదని వైద్యులు తెలిపారు. కావున ఆమెను వెంటనే హైదరాబాద్కు తరలించి, మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్స్ నిర్ణయించారు.ఈ మధ్యే ప్రతిభా భారతి గుండెపోటుతో విశాఖపట్నంలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ప్రతిభ శరీరంలో ప్లేట్లెట్లు 60వేలకు పడిపోయాయి.. రక్తం ఎక్కించినా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉందని, రక్తం ఎక్కించే ప్రయత్నాలు చేసినా ఆమె శరీరం సహకరించడంలేదని తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతిని మంత్రి కళావెంకట్రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తదితరులు పరామర్శించారు. మరోవైపు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతి తండ్రి డాక్టర్ పున్నయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.