న్యూఢిల్లీ, జూలై 20 : భారత 14వ రాష్ట్రపతిగా విజయం సాధించడం తనకు ఉద్విగ్నమైన సమయం అని త్వరలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ అన్నారు. తన జీవితం దేశానికి అంకితం అని ఉద్వేగంగా ప్రసంగించారు. గురువారం నాటి రాష్ట్రపతి ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో రామ్నాథ్ కోవింద్ విజయాన్ని సొంతం చేసుకొని భారత 14వ రాష్ట్రపతిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ రాష్ట్రపతి పదవిని గొప్ప బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పారు. తన విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోపక్క విజయం సాధించిన రామ్ నాథ్కు ప్రత్యర్థి మీరా కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవిలో విజయవంతంగా రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను ఓటమిని అవమానంగా భావించడం లేదని, ఒక సైద్ధాంతిక పోరాటమే చేశాను తప్ప మరొకటి కాదన్నారు. తన పోరాటం ఇంతటితో ఆగిపోలేదని మున్ముందు కూడా కొనసాగిస్తానని పేర్కొన్నారు. తనకు ఓటు వేసిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, ఇతర పార్టీలకు చెందిన వారంతా ఆయనకు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ మేరకు రామ్నాథ్ స్వగ్రామంలో సంబరాలు మిన్నంటాయి.